కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఓపెన్ కోర్టా? ఇన్ కెమెరా విచారణనా?.. చాయిస్ కేసీఆర్దే

కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఓపెన్ కోర్టా? ఇన్ కెమెరా విచారణనా?.. చాయిస్ కేసీఆర్దే
  • నేడు కేసీఆర్ విచారణ
  • ఉదయం 11.30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందుకు..!
  • ఓపెన్ ​కోర్టా? ఇన్​ కెమెరా ఎంక్వైరీనా?.. చాయిస్​ కేసీఆర్దే

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్​ కమిషన్  బుధవారం నిర్వహించే క్రాస్​ ఎగ్జామినేషన్కు హాజరుకానున్నారు. ఉదయం 11.30  గంటలలోపు బీఆర్కే భవన్​చేరుకోనున్న కేసీఆర్​.. ఓపెన్​కోర్టులో పాల్గొంటారా? లేదంటే ఇన్​కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.  కాళేశ్వరం నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో  సంబంధం ఉన్న అందరు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ  చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే  బుధవారం కేసీఆర్​ను క్రాస్​ఎగ్జామినేషన్​ చేయనుండగా, కమిషన్​ ఏయే ప్రశ్నలు వేస్తుంది?  దానికి కేసీఆర్  నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి? అనే ఉత్కంఠ నెలకొన్నది.

కీలక ప్రశ్నలు..
నిరుడు మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్​ కమిషన్..​ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్​మెంట్లను రికార్డ్​ చేసింది. ఓపెన్​కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజినీర్లు, ఐఏఎస్​లను క్రాస్​ఎగ్జామినేషన్​ చేసి, అఫిడవిట్లు తీసుకున్నది. దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో..  విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్​మెంట్లు కూడా రికార్డు  చేయాలనే నిర్ణయానికి కమిషన్​ వచ్చింది.

ఇందులో భాగంగానే  మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ​ మంత్రి హరీశ్​రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు నోటీసులు జారీ చేసింది.  ఈ మేరకు ఈ నెల 6న  ఈటలను , 9న  హరీశ్​రావును ఓపెన్​కోర్టులో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కు కేబినెట్​సబ్​కమిటీ ఒకే చెప్పిందని, నిర్మాణానికి కేబినెట్​అప్రూవల్​కూడా ఉందని ఈటల స్టేట్​మెంట్​ఇచ్చిన సంగతి తెలిసిందే.

సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్​ సిఫార్సుల మేరకే ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని హరీశ్​రావు చెప్పారు.  బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ ఇంజినీర్ల నిర్ణయమేనని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని  కమిషన్​కు వివరించారు.  టెక్నికల్​ అంశాలతో తమ ప్రభుత్వానికేం సంబంధం లేదని వెల్లడించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు  సీఎంగా ఉన్న కేసీఆర్..  కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతున్నది.

ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు రీ ఇంజినీరింగ్​చేయడానికి గల కారణాలు, బ్యారేజీల లొకేషన్ల మార్పు, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ లోపాలు, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ (నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ  అథారిటీ) లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ను కమిషన్​పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది.

రెండు ఆప్షన్స్..
ముఖ్యమైన అధికారులు, ఇంజినీర్లను, తాజాగా మాజీ మంత్రులు ఈటల, హరీశ్​రావును  ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన  ఘోష్ కమిషన్.. అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే.  కానీ కేసీఆర్​ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్​కోర్టులో కాకుండా ఇన్ కెమెరా ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ విధానంలో ఎంక్వైరీ హాల్​లో కమిషన్​చైర్మన్​, కేసీఆర్​ మాత్రమే ఉండి, క్రాస్​ఎగ్జామినేషన్​ప్రక్రియను కెమెరా ద్వారా రికార్డు చేస్తారు.  కేసీఆర్​  కోరుకుంటే అప్పటికప్పుడు  ఓపెన్ కోర్టులోనూ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకూ కమిషన్​ ఒకే చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఓపెన్​కోర్టులో క్రాస్​ఎగ్జామినేషన్​ జరుగుతున్న తీరును హరీశ్​రావు ద్వారా తెలుసుకున్న కేసీఆర్,  ఇన్​కెమెరా ఎంక్వైరీ వైపు మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతున్నది.