
- నేడు కేసీఆర్ విచారణ
- ఉదయం 11.30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందుకు..!
- ఓపెన్ కోర్టా? ఇన్ కెమెరా ఎంక్వైరీనా?.. చాయిస్ కేసీఆర్దే
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ బుధవారం నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరుకానున్నారు. ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్చేరుకోనున్న కేసీఆర్.. ఓపెన్కోర్టులో పాల్గొంటారా? లేదంటే ఇన్కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాళేశ్వరం నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బుధవారం కేసీఆర్ను క్రాస్ఎగ్జామినేషన్ చేయనుండగా, కమిషన్ ఏయే ప్రశ్నలు వేస్తుంది? దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి? అనే ఉత్కంఠ నెలకొన్నది.
కీలక ప్రశ్నలు..
నిరుడు మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఓపెన్కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజినీర్లు, ఐఏఎస్లను క్రాస్ఎగ్జామినేషన్ చేసి, అఫిడవిట్లు తీసుకున్నది. దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో.. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది.
ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీశ్రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 6న ఈటలను , 9న హరీశ్రావును ఓపెన్కోర్టులో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కు కేబినెట్సబ్కమిటీ ఒకే చెప్పిందని, నిర్మాణానికి కేబినెట్అప్రూవల్కూడా ఉందని ఈటల స్టేట్మెంట్ఇచ్చిన సంగతి తెలిసిందే.
సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ సిఫార్సుల మేరకే ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని హరీశ్రావు చెప్పారు. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ ఇంజినీర్ల నిర్ణయమేనని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని కమిషన్కు వివరించారు. టెక్నికల్ అంశాలతో తమ ప్రభుత్వానికేం సంబంధం లేదని వెల్లడించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్.. కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతున్నది.
ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు రీ ఇంజినీరింగ్చేయడానికి గల కారణాలు, బ్యారేజీల లొకేషన్ల మార్పు, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ లోపాలు, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ను కమిషన్పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది.
రెండు ఆప్షన్స్..
ముఖ్యమైన అధికారులు, ఇంజినీర్లను, తాజాగా మాజీ మంత్రులు ఈటల, హరీశ్రావును ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన ఘోష్ కమిషన్.. అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్కోర్టులో కాకుండా ఇన్ కెమెరా ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ విధానంలో ఎంక్వైరీ హాల్లో కమిషన్చైర్మన్, కేసీఆర్ మాత్రమే ఉండి, క్రాస్ఎగ్జామినేషన్ప్రక్రియను కెమెరా ద్వారా రికార్డు చేస్తారు. కేసీఆర్ కోరుకుంటే అప్పటికప్పుడు ఓపెన్ కోర్టులోనూ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకూ కమిషన్ ఒకే చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఓపెన్కోర్టులో క్రాస్ఎగ్జామినేషన్ జరుగుతున్న తీరును హరీశ్రావు ద్వారా తెలుసుకున్న కేసీఆర్, ఇన్కెమెరా ఎంక్వైరీ వైపు మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతున్నది.