కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే: వివేక్ వెంకటస్వామి

కోవిడ్ తరువాత ప్రపంచ దేశాలన్నీ కుదేలైతే  భారతదేశాన్ని సుస్థిరంగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ తో పాటు రేషన్ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.  ఉజ్వల పథకం కింద  ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ.. దేశ జీడీపీని గణనీయంగా ప్రధాని మోడీ పెంచుతున్నారన్నారు.  అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించానని, ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నట్లు ఇతర రాష్ట్రాలకు పోయి అన్నీ  అబద్దాలు చెబుతున్నారన్నారు వివేక్ వెంకటస్వామి. 

ALSO READ: జూన్ 22న కొల్లూర్‌ డబుల్‌ ఇండ్లను ప్రారంభించనున్న కేసీఆర్‌

కేసీఆర్ వంద పడకల ప్రగతి భవన్ లో ఉంటూ... . కొడుకు, బిడ్డ, అల్లుడికి ఫాంహౌజ్ లు ఇచ్చారన్నారు. కాని పేద ప్రజలకు కనీసం ఒక్కటి కూడా  డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.  కాని ప్రధానమంత్రి మోడీ  4 కోట్ల ఇండ్లు కట్టించారని తెలిపారు .మంచిర్యాలలో ఓ సభలో పాల్గొన్న ఆయన ఎవరికైనా ఇండ్లు, నీళ్లు ఇచ్చారా అని అడగ్గా.. ఆ సభలోని ప్రజలు లేదు..లేదు అంటూ నినాదాలు చేశారు.  పేద ప్రజలకు మాయ మాటలు చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షల కోట్ల రూపాయిలు అవినీతికి పాల్పడ్డారని వివేక్ వెంకటస్వామి అన్నారు.  మిషన్ భగీరథ పేరుతో కమీషన్లు దండుకున్నారన్నారు.

అంతకుముందు.. దండెపల్లి  మండలం గూడెం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామికి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గూడెం నుండి లక్షెట్టిపేట వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. లక్షెట్టిపేటలో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, రఘునాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇక్కడ బండి సంజయ్, వివేక్ వెంకటస్వామికి బీజేపీ కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. లక్షెట్టిపేట  జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు.