స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ

ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ మీదుగా అనుమతించనున్నారు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. రవీంద్రభారతి, హిల్‌ ఫోర్ట్‌ రోడ్డు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు.

బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వద్ద కుడి వైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద దారి మళ్లించి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు. కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్‌ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్‌, ఇడెన్‌ గార్డెన్‌ మీదుగా అనుమతిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ వద్ద దారి మళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు. హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ వద్ద దారి మళ్లించనున్నారు.