కేసీఆర్.. నీ టైం అయిపోయింది, గద్దె దించేస్తాం : విజయశాంతి

 కేసీఆర్.. నీ టైం అయిపోయింది, గద్దె దించేస్తాం : విజయశాంతి
  •     నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే లారీతో  తొక్కించారు
  •     మంథనిలో లాయర్​ దంపతులను నరికి చంపారు
  •     రైతులను జైళ్ల పాలు చేశారు
  •     మంథని బహిరంగ సభలో కాంగ్రెస్​ లీడర్​ విజయశాంతి

పెద్దపల్లి, వెలుగు : ‘కేసీఆర్​ నీ టైం అయిపోయింది. నిన్ను దించేస్తాం. నీ హయాంలో అన్నీ హత్యారాజకీయాలే.. నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించారు. మంథనిలో న్యాయం కోసం పోరాడుతున్న లాయర్​ దంపతులను పట్టపగలే నరికి చంపారు. హక్కుల కోసం ప్రశ్నించిన రైతులను బేడీలు వేసి జైళ్ల పాలు చేశారు’ అని కాంగ్రెస్ సీనియర్​ నాయకురాలు విజయశాంతి  ధ్వజమెత్తారు. కరీంనగర్​జిల్లా మంథనిలో జరిగిన  సభలో ఆమె  మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ లో జరిగిన అవినీతిలో ఎవరినీ ప్రశ్నించలేదని,  మేడిగడ్డ కూలిపోయే స్థితిలో ఉందని, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను సీఎం కేసీఆర్​మోసం చేశారన్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ తోడుదొంగలన్నారు. ‘మోదీ, అమిత్​షా, నడ్డా.. ప్రతిసారీ  తెలంగాణలో కేసీఆర్​ది కుటుంబపాలన, అవినీతిలో మునిగిపోయిందంటరు.  కానీ, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కవిత లిక్కర్​స్కాంలో అడ్డంగా దొరికినా ఆమెపై చర్యలు లేవు’ అని అన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్​ నడుమ తెరవెనుక ఒప్పందాలున్నాయని, ఎలాగైనా కేసీఆర్​ను మరోసారి సీఎం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. అవినీతి సర్కార్​ను ఇంటికి పంపడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మంథని కాంగ్రెస్​అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్​బాబు, నాయకులు పాల్గొన్నారు.