వరకట్నంగా బంగారం, భూమి, BMW కారు.. పెళ్లి క్యాన్సిల్.. వధువు ఆత్మహత్య

వరకట్నంగా బంగారం, భూమి, BMW కారు.. పెళ్లి క్యాన్సిల్.. వధువు ఆత్మహత్య

కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. వరకట్న డిమాండ్లను తన కుటుంబం తీర్చలేదన్న కారణంతో ఆమె ప్రియుడు తమ పెళ్లిని రద్దు చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. షహానా అనే మహిళ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 5న ఉదయం ఆమె అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.

షహానా మరణం తరువాత, ఆమె కుటుంబం కట్న డిమాండ్లను తీర్చలేకపోవడంతో ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. అతని కుటుంబం బంగారం, భూమితో పాటు BMW కారును కట్నంగా డిమాండ్ చేసింది. దాన్ని షహానా కుటుంబం ఇవ్వలేకపోవడంతో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి గా ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇక మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేస్తున్న షహానా తండ్రి కూడా ఇటీవల మరణించినట్టు సమాచారం.

ఈ ఘటనపై మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ డిసెంబర్ 6న ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. ఇక కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సతీదేవి.. షహానా తల్లిని స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలపై మహిళా కమిషన్ నివేదిక కోరుతుందని, ఈ కేసుపై విచారణ జరిపించాలని సతీదేవి డిమాండ్ చేశారు. బాధితురాలి నుంచి వైద్యుడి కుటుంబం వరకట్నం డిమాండ్ చేసినట్లు తేలితే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెడతామని సతీదేవి తెలిపారు.

ఈ విషయంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా స్వయంగా కేసు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అతనిని తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది.