హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర : సూత్రధారి ఫర్హతుల్లా ఘోరీ

హైదరాబాద్లో పేలుళ్ల  కుట్ర : సూత్రధారి ఫర్హతుల్లా ఘోరీ

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు అబ్దుల్ జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి జాహెద్ అండ్ టీంకు  పేలుడు పదార్థాలు అందినట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నెల 28న పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు చేరినట్లు తెలిపారు. జాహెద్  బైక్ పై వెళ్లి 4 హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకొచ్చాడు.  వీటిలో ఒక గ్రెనేడ్ ను తన దగ్గరే ఉంచుకొని.. మిగతా  మూడింటిని మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్ లకు ఇచ్చాడు. పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.  ఇందుకోసం హవాలా మార్గంలో దాదాపు రూ.30 లక్షలకు పైగా నిధులు సమీయుద్దీన్, మాజ్, జాహెద్ లకు అందినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల యువకులకు డబ్బు ఆశ చూపించి ఉగ్రవాదం వైపు మళ్లించి.. హైదరాబాద్ లో దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ  ? 

ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ  20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి భారత్ లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నాడు. అతడి కనుసన్నల్లోనే తాజాగా హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 62  ఏళ్ల ఫర్హతుల్లా ఘోరీ  స్వస్థలం సైదాబాద్ లోని కుర్మగూడ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అతడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ లో ఉంటూ లష్కరే తైబా, జేషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నాడు.