
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో బ్యాంకర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు పంట రుణాలను లక్ష్యం కన్నా 20 శాతం ఎక్కువ పంపిణీ చేశామని, ఇదే స్ఫూర్తి రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా చూపించాలని బ్యాంకర్లకు సూచించారు. మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరం 7 వేల 24 కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా 8 వేల 89 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ సంవత్సరంలో రైతులకు అందించే స్కేల్ ఆఫ్ లోన్ డిస్ట్రిబ్యూషన్ పెంచాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు రుణాల పంపిణీ పెంచాలన్నారు. అనంతరం 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ పరిధిలో రూ. 8 వేల 244 కోట్లు, ఎంస్ఎంఈ రంగానికి రూ.2,968 కోట్లు, ఇతర ప్రాధాన్యత సెక్టార్ కు రూ.289 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.4,682 కోట్లు మొత్తం 16,185 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీవో చేతన్ గోరేకర్, నాబార్డ్ డీడీఎం సుజిత్ కుమార్, ఎస్బీఐ ఆర్ఎం బి. రాజశేఖర్, టీజీబీఆర్ఎం కె.విజయ్ కుమార్, డీసీసీబీ జీఎం వసంత రావు, యూబీఐ చీఫ్ మేనేజర్ లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.