- బైక్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ
- ముఖ్యఅతిథిగా ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి హాజరు
నెట్వర్క్, వెలుగు : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బర్త్ డే సందర్భంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, అన్నదానం, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి పొంగులేటి పిలుపు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అక్కడి క్యాంప్ ఆఫీస్ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
