ఖమ్మం, వెలుగు: గత మూడేండ్లుగా పెండింగ్ ఉన్న విద్యార్థుల రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లాలో బీటెక్, డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీల బంద్ రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరగాల్సిన బి. ఫార్మసీ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించి, మేనేజ్ మెంట్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పీజీ కాలేజీ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీల మేనేజ్ మెంట్లు సమావేశమై మాట్లాడుతూ బకాయిలను ప్రభుత్వం చెల్లించేంతవరకు బంద్ పాటిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో మేనేజ్మెంట్ బాధ్యులు ఆర్జేసీ కృష్ణ, కాటేపల్లి నవీన్ బాబు, బొమ్మ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
