
కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపస్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం పకోడీ, రాత్రికి సాంబారు, ఆలుగడ్డ కర్రీతో స్టూడెంట్లకు భోజనం పెట్టారు. అన్నం తిన్న తర్వాత పది మంది స్టూడెంట్లు వాంతులు, కడుపు నొప్పి, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. గమనించిన నిర్వాహకులు రావటంతో ఆరుగురు స్టూడెంట్లను శనివారం రాత్రే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. ఆదివారం ఉదయం మరో నలుగురు అస్వస్థతకు గురికావడంతో వారిని సైతం హాస్పిటల్కు తరలించారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ పులి సాంబశివుడు హాస్పిటల్కు చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు. ముక్కిపోయి పురుగులు పట్టిన బియ్యం, క్వాలిటీ లేని చింతపండు, ఇతర సరుకులతో వంటలు చేస్తున్నారని తహసీల్దార్ ఎదుట వాపోయారు. కాగా, ఈ నెల 4, 5 తేదీల్లో 40 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురికాగా.. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ జరగడంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.