సీజనల్ వ్యాధులపై యాక్షన్ ప్లాన్.. దోమలకు చెక్ చెప్పేందుకు ఫ్రై డే..డ్రై డే’ ప్లాన్

సీజనల్ వ్యాధులపై  యాక్షన్ ప్లాన్.. దోమలకు చెక్ చెప్పేందుకు ఫ్రై డే..డ్రై డే’ ప్లాన్
  • రెండేండ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా డెంగ్యూ కేసులు 
  • వైరల్ ఫీవర్ల నియంత్రణకు వైద్య శాఖ అధికారుల ముందస్తు చర్యలు
  • గతేడాది ఎక్కువ కేసులు వచ్చిన హైరిస్క్ గ్రామాలపై స్పెషల్ ఫోకస్

ఖమ్మం, వెలుగు :వానాకాలం షురు కావడంతో సీజనల్ వ్యాధులు ముప్పు పొంచి ఉంటుంది. విష జ్వరాలు, డెంగ్యూ, చికున్​ గున్యా, మలేరియా కేసులు నమోదు కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడడంతో పాటు, వైరల్ ఫీవర్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టారు. 

రాష్ట్రంలో మూడేండ్లుగా జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక డెంగ్యూ కేసులు ఖమ్మం జిల్లాలో నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా వైద్యశాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ద్వారా అప్రమత్తమవుతున్నారు. గత నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో  సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్షలోనూ చర్చించారు.  
 

రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా టాప్

రెండు, మూడేండ్లుగా వానాకాలం సీజన్​లో ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలో ఈ జిల్లానే టాప్​లో ఉంటుంది. ఏటా 500 కు తగ్గకుండా డెంగ్యూ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో గతేడాది ఎక్కువ డెంగ్యూ కేసులు వచ్చిన గ్రామాలను ఆఫీసర్లు హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. వీటిపై ముందుగా ఫోకస్​పెట్టడం ద్వారా వైరల్ ఫీవర్లను కంట్రోల్ చేయొచ్చని అంచనా వేశారు. గతేడాది తిరుమలాయపాలెం మండలంలోనే అధికంగా 55 కేసులు నమోదయ్యాయి. పెద్ద మునగాలలో 10, గుర్రాలపాడులో 8, గుదిమల్లలో 8, నేలకొండపల్లిలో 9, వైరా, తూటికుంట్ల, పైనంపల్లిలో 7, బాణాపురం, పోలేపల్లిలో 6 చొప్పున కేసులు వచ్చాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 

2022లో జిల్లాలో 98 చికున్​గున్యా కేసులు , 2 మలేరియా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆ తర్వాత రెండేండ్ల నుంచి మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే డెంగ్యూ కేసుల్లో మాత్రం ప్రభుత్వాస్పత్రుల్లో ఎలీసా టెస్టు చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్​కేసుల సంఖ్యను మాత్రమే ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చిన పేషెంట్లకు డయాగ్నస్టిక్​సెంటర్లలో ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేసి డెంగ్యూ పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారు. డెంగ్యూ పాజిటివ్​ వచ్చిందని, ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోతుందని ట్రీట్ మెంట్ పేరుతో పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేయడం కామన్​ అయింది. ఈ ఏడాదైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగ్యూ పేరుతో జరిగే దోపిడీకి ఆఫీసర్లు చెక్​పెట్టాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.  

అలర్ట్ గా ఉన్నాం 

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే యాక్షన్​ ప్లాన్​పై అధికారులతో మీటింగ్స్ నిర్వహించాం. డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించాం. గ్రామాల్లోని ఆయుష్మాన్​ఆరోగ్య సెంటర్లు, మండల కేంద్రాల్లోని పీహెచ్​సీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. వైద్య సిబ్బంది అన్ని టెస్టులు చేస్తుండగా.. శాంపిల్స్ తీసుకొని ఎక్కువ కేసులు ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయో కూడా తెలుసుకుంటున్నాం. వర్షాలు మొదలవగానే ఫ్రైడే డ్రై డే ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తాం. 
- కళావతి బాయి, డీఎంహెచ్ఓ, ఖమ్మం