భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో బుధవారం రెండు వేర్వేరు ఘటనల్లో ఖమ్మం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. కూనవరం రోడ్డులోని ఎంవీఐ ఆఫీస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కేరళకు కారులో 30.600 కిలోల ఎండు గంజాయిని తరలిస్తూ కేరళకు చెందిన నజీర్పుతియా వేటిల్, జకారియా పారాయిల్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో యువకుడు రవి యమహా బైక్పై 21.300 కిలోల ఎండు గంజాయిని తరలిస్తూ పోలీసులను చూసి వాహనం వదిలేసి పారిపోయాడు. అతడు కూడా కారులో పట్టుబడిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు దాడుల్లో రూ.26 లక్షల విలువైన 51.900 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.
