
- గత నెల వానలు పడగా పత్తి విత్తనాలు వేసిన రైతులు
- సాగు పనుల్లో బిజీ అవుతున్న రైతులు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోస్తున్నాయి. మే నెలలో వర్షాలు కురియడంతో ముందుగానే పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు పది, పదిహేను రోజులుగా సరైన వానలు లేక దిగులు పడ్డారు. మొక్క మాడిపోయే తరుణంలో జల్లులు కురుస్తుండడంతో ఆనందపడుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు వానలు పడితే పత్తి పంటకు ఢోకా ఉండదని అంటున్నారు. చాలారోజుల తర్వాత పడిన వర్షాలతో గ్రామాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. కొందరు రైతులు వరి నారు పోసుకునేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకుంటుండగా, మరికొందరు దుక్కులను సిద్ధం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో వర్షాకాలం మొదలైన తర్వాత గత మూడు రోజుల నుంచే వానలు పడుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 95.5 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. 3 రోజులు మాత్రమే వర్షాలు పడగా, 50 శాతం లోటు వర్షపాతం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం పెనుబల్లి, తల్లాడ మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకో పది మండలాల్లో లోటు వర్షపాతం, మరో 9 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగాలంటే కొద్ది రోజుల పాటు వర్షాలు ఇలాగే పడాలని రైతులు అంటున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 35 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 1,350 ఎకరాల్లో పెసర, 450 ఎకరాల్లో జనుము, 16 వేల ఎకరాల్లో జీలుగు, 7 వేల ఎకరాల్లో వరి నారుమళ్లు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 124.8 మిల్లీమీటర్లు కాగా 62.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈనెలలో 7 రోజుల పాటు వర్షాలు పడినా సాధారణ వర్షపాతంలో యాభై శాతం మాత్రమే నమోదైంది. జిల్లాలోని అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకో 8 మండలాల్లో లోటు వర్షపాతం, 10 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం రికార్డయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 55 వేల ఎకరాల్లో పత్తి, 700 ఎకరాల్లో మొక్కజొన్న, 4500 ఎకరాల్లో జీలుగు, 182 ఎకరాల్లో జనుము, 200 ఎకరాల్లో వరి నారు పోశారు.
వర్షాకాలం పంటలకు మేలు చేసే వానలు పడుతుండడంతో వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవసరమైన సేవలందించడానికి సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా ఇప్పటికే పంటల సాగుపై అవగాహన కల్పించారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మకుండా మండలాల వారీగా పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వరి నాట్ల విధానంలో కాకుండా నేరుగా వెదజల్లే పద్దతిలో సాగు చేస్తే రైతులు ఖర్చు తగ్గించుకోవచ్చని, కరివెద విధానాన్ని పాటించాలని రైతులకు సూచిస్తున్నారు.
విత్తనాలకు ప్రాణం పోసినట్లైంది
వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో నాటిన పత్తి గింజలన్నీ ఎండిపోతాయని భయమయ్యింది. ఇప్పడు వానలు పడడంతో విత్తనాలలకు ప్రాణం పోసినట్లు అయింది. ఈ వర్షాలతో పంటలకు ఢోకా ఉండదు.
-కొప్పుల ఉపేందర్, ముత్తారం, ముదిగొండ మండలం