
- వర్షాకాలం రావడంతో పాత బ్రిడ్జికి రిపేర్లు
- రూ.180 కోట్లతో జరుగుతున్న తీగల వంతెన పనులు
- వచ్చే మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఈ ఏడాదికి వందేళ్ల బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు కొనసాగించనున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాత బ్రిడ్జికి రిపేర్లు చేయనున్నారు.
రూ.180 కోట్లతో వంతెన పనులు..
మున్నేరు మీద కాల్వొడ్డు నుంచి నాయుడుపేటకు వందేళ్ల కింద నిర్మించిన బ్రిడ్జిని ఆనుకొని కొత్త తీగల వంతెన నిర్మిస్తున్నారు. సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వెళ్లే జాతీయ రహదారిపై కిలోమీటర్ 57.150 నుంచి 58.400 కి.మీ.వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో తీగలతో నిర్మించే వంతెన 300 మీటర్లు ఉండనుంది. 390 మీటర్ల బాక్స్ టైప్ వయాడక్ట్ సూపర్ స్ట్రక్చర్ నిర్మించనున్నారు. దీనితో పాటు బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్లను నిర్మిస్తారు. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్) పద్ధతిలో రూ.180 కోట్లతో దీని పనులు జరుగుతున్నాయి.
బ్రిడ్జి, అప్రోచ్ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో కొంత ఆలస్యం జరగడంతో పనులు లేట్ అయ్యాయి. రోడ్డుకు పక్కన గుడిసెలు, రేకుల ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి అక్కడి నుంచి తరలించారు. అధికారులు చెబుతున్న ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు బ్రిడ్జిని పూర్తి చేసేలా ఒప్పందం ఉన్నా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో సంక్రాంతి నాటికే పనులు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
పాత బ్రిడ్జికి రిపేర్లు..!
మున్నేరు నదిపై తీగల వంతెన ఆలస్యం కావడంతో వందేళ్ల కింద నిజాం కాలంలో నిర్మించిన రాతి బ్రిడ్జిని మళ్లీ ఉపయోగించుకునేందుకు సిద్ధం చేయనున్నారు. గతేడాది సెప్టెంబర్ లో భారీ వర్షాలు వచ్చిన సమయంలో ఆ బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినా, భారీ వాహనాలను మాత్రం అనుమతించలేదు. మున్నేరులో వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత పాత కాజ్ వే పై తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి, సమాంతరంగా తీగల వంతెన పనులను కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కావడంతో మళ్లీ స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో వచ్చిన అకాల వర్షాల సమయంలోనే ఒక రోజు వరద రావడంతో కాజ్ వేను పూర్తిగా మూసివేశారు. పూర్తిస్థాయిలో వర్షాలు ప్రారంభమయ్యే లోపు ప్రత్యామ్నాయంగా పాత వంతెనకు రిపేర్లు చేసి సిద్ధం చేయనున్నారు. ఈ వర్షాకాలంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా పది రోజుల్లో పాత బ్రిడ్జిని రెడీ చేస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు.
తీగల వంతెన పనులు ఇలా..
తీగల వంతెన కోసం మొత్తం 16 పిల్లర్లకు గాను అన్నీ పూర్తి కావచ్చాయి. కంప్లీట్ అయిన పిల్లర్లపై ఇప్పటికే ప్రీకాస్ట్ రూపంలో సిద్ధం చేసిన స్లాబ్ సెగ్మెంట్ లను బిగిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెంప్లాంట్ లో వీటిని తయారుచేసి, పెద్ద లారీల ద్వారా ట్రాన్స్ పోర్ట్ చేసి, పెద్ద క్రేన్లతో, సపోర్ట్ జాయింట్రీల సాయంతో పిల్లర్లపై బిగిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు తరహాలోనే ఈ సెగ్మెంట్ల మధ్య ఐరన్ తీగలను బిగించడం ద్వారా వాటిపై రోడ్డు రెడీ అవుతుంది.
ఇలా ఈ బ్రిడ్జిలో మొత్తం 128 సెగ్మెంట్లను కలిపి 21 మీటర్ల వెడల్పులో ఫోర్ లేన్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. మధ్యలో సెంట్రల్ డివైడర్, రెండు వైపులా ఫుట్ పాత్ కూడా ఉంటుంది. నిర్మాణం పూర్తయితే మున్నేరు నది మధ్యలో నాలుగు పిల్లర్ల మీద ఎత్తుగా హైదరాబాద్ దుర్గం చెర్వు తీగల వంతెన లాగా ఉండనుంది.