అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్

అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్

నిర్మల్ జిల్లా : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు వార్నింగ్ ఇచ్చారు. రూ.2 కోట్ల 25 లక్షల ACDP (Assembly constituency development fund) నిధులు అపి, తనను అణగదొక్కడానికి జాన్సన్ నాయక్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో తాను ధర్నా చేస్తానని హెచ్చరించారు. తన వద్ద విధుల్లో ఉన్న SB కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు తొలగించడం సరికాదన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి తాను పార్టీ నాయకులకు ఎంతో కృషి చేశానని, వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

ఖానాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను తప్పకుండా రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి తాను చేస్తే.. గొప్పలు వారు చెప్పుకోవడం సరికాదన్నారు. కక్షపూరితంగానే అభివృద్ది పనులను నిలిపివేయిస్తున్నారని ఆరోపించారు.