
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి మంగళవారం ఆయన లేఖ రాశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అందులో విజ్ఞప్తి చేశారు. ‘‘వరుసగా రెండు లోక్సభ టర్మ్లలో డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉండడం.. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. 17వ లోక్సభ సమయంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు.
ఇప్పుడు కొనసాగుతున్న 18వ లోక్సభలోనూ ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించలేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. ఇలా చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి. లోక్సభలో స్పీకర్ తర్వాత అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి డిప్యూటీ స్పీకరే. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, సభా సంప్రదాయాలను పాటిస్తూ..
డిప్యూటీ స్పీకర్ ఎన్నికను వెంటనే నిర్వహించండి” అని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానికి రాసిన లేఖను సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఖర్గే షేర్ చేశారు. ‘‘ఒకటి నుంచి 16వ లోక్సభ వరకు ప్రతి టర్మ్లోనూ డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తున్నది” అని అందులో పేర్కొన్నారు.