నమ్మి వచ్చిన అమ్మాయిని చంపేసిండు

నమ్మి వచ్చిన అమ్మాయిని చంపేసిండు

బిల్డింగ్ పై నుంచి నెట్టేసి యువతి హత్య
నిందితుడు దిలీప్, బాధితురాలు మధ్యప్రదేశ్ వాసులు

హైదరాబాద్, వెలుగు: ప్రేమించానన్నాడు. కలకాలం జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాడు. ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్​కు తీసుకుని వచ్చాడు. 10 రోజులు గడిచాయి. ప్రేమ కాస్తా కోపమైంది. దీంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందికి నెట్టేశాడు. ప్రేమించి, నమ్మి వచ్చిన యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు. హైదరాబాద్​లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పెళ్లి చేసుకున్నానని చెప్పి..

మధ్యప్రదేశ్​లోని బాలఘర్ జిల్లాకు చెందిన దిలీప్ (22).. రెండేళ్ల కిందట హైదరాబాద్​కు వచ్చాడు. శక్తి నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న వాసవి శ్రీ నిలయం అపార్ట్​మెంట్ లో పని చేస్తున్నాడు. తన ఊరికే చెందిన సీమా దామాహే(22)ను ప్రేమించిన దిలీప్.. 10 రోజుల కిందట ఆమెను నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకున్నానని తనతో పనిచేస్తున్న వారికి చెప్పాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దిలీప్, సీమాల మధ్య గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో సీమాను మూడో అంతస్తు పైకి తీసుకెళ్లి అక్కడ కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెను బిల్డింగ్ పై నుంచి నెట్టివేశాడు. భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. గాయాలతో పడి ఉన్న సీమాను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ సీమా మృతి చెందింది. దిలీప్ పరారీలో ఉన్నాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.