
- చీఫ్ గెస్ట్గా ఎవరనేది ఇంకా నిర్ణయించ లేదు
- ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి ఈ ఉత్సవాలను కేసీఆర్ నిర్వహిస్తలేరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలను గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉత్సవాలకు చీఫ్ గెస్టుగా ఎవరిని ఆహ్వానించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకు విస్మరించాయని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘‘నిజాం నియంతృత్వం నుంచి విమోచనం జరిగిన రోజున కూడా మనం ఉత్సవాలను జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నం. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఈ ఉత్సవాలను నిర్వహిస్తమని కేసీఆర్ మాట ఇచ్చి తప్పిండు.
మజ్లిస్ పార్టీకి, అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్ ఈ విమోచన ఉత్సవాలను జరపడం లేదు” అని దుయ్యబట్టారు. ఒవైసీకి భయపడే ఈ ప్రోగ్రామ్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారని అన్నారు. ‘‘1948 నాడు అప్పటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ పటేల్ ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. నిరుడు ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొనసాగిస్తుంది”అని చెప్పారు.
‘మేరీ మాటీ.. మేరా దేశ్’ ప్రతిజ్ఞ చేద్దాం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా మన జాతీయ వీరులందరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని కిషన్రెడ్డి తెలిపారు. అదే స్ఫూర్తితో అందరిని మరోసారి ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘‘మేరీ మాటీ ..మేరా దేశ్’’ పేరుతో ఈ నెల 1న కార్యక్రమం ప్రారంభమైందని కిషన్ రెడ్డి వివరించారు. ‘మన మట్టికి నమస్సులు.. మన వీరులకు వందనం’ నినాదంతో స్వాతంత్ర్య సమరయోధులను, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ శాంతి భద్రతల రక్షణలో అమరులైన వారందరిని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
అందులో భాగంగానే ప్రతి ఇంటి నుంచి పిడికెడు మట్టి కాని.. పిడికెడు బియ్యాన్ని కాని కలశంలో సేకరించాలని చెప్పారు. 2047 నాటికి దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో అందరూ తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ‘‘మేరీ మాటీ.. మేరా దేశ్’’ అని దేశ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని కేంద్రం నిర్ణయించిందని, ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమమని, దేశ ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు.