మూసీని ఆక్రమిస్తున్నా సర్కారు పట్టించుకుంటలేదు

మూసీని ఆక్రమిస్తున్నా సర్కారు పట్టించుకుంటలేదు

భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈసారి కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. మూసీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. ఒక్క అడుగు కూడా ముందు పడలేదని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని లోన్లు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్ సర్కారు చేసిందేమీలేదని అన్నారు.

వరద పరిహారం ఇవ్వండి
రాత్రి సమయంలో మట్టి పోసి మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.  ఆ కారణంగానే పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మూసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని చెప్పినా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గుజరాత్ లోని సబర్మతి నదిని పరిశీలించి వచ్చిన మంత్రులు మూసీపై రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కేంద్రంపై కుట్రలు చేస్తున్నవా?
భారీ వర్షాలతో నగరం ఆగమాగమైనా ముఖ్యమంత్రి మాత్రం బయట అడుగుపెట్టకపోవడం విచారకరమని కిషన్ రెడ్డి అన్నారు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం రాజకీయ ఆలోచనలపైనే దృష్టి పెట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఏం చేశారని నిలదీశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల విషంలో తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదన్న ఆయన.. కేంద్రాన్ని, నరేంద్రమోడీని ఎంత విమర్శిస్తే టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలని సూచించిన కిషన్ రెడ్డి ఏడాది తర్వాత తెలంగాణ ప్రజలు ఎలాగైనా కేసీఆర్ కుటుంబానికి అవకాశమివ్వరని చురకలంటించారు.