- ఓయూలో ఖేలో ఇండియా డైలాగ్: ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమానికి హాజరు
తార్నాక, వెలుగు: విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఎఫ్ఎల్యూ) ఓయూ క్యాంపస్లో నిర్వహించిన ‘ఖేలో ఇండియాడైలాగ్: ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని, 2036 ఒలంపిక్స్ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 1,500 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా మాట్లాడారని తెలిపారు. మోదీ నాయకత్వంలో క్రీడలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారిందన్నారు.
గతంలో క్రీడా రంగం నిర్లక్ష్యానికి గురైందని, రాజకీయ జోక్యం కారణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులకు తగిన అవకాశాలు లభించేవి కాదన్నారు. ప్రస్తుతం కింది స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడంతో అంతర్జాతీయ పోటీల్లో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లే ప్రతి క్రీడాకారుడిని ప్రధాని స్వయంగా కలుస్తారని, విజయం సాధించిన వారికి వెంటనే అభినందనలు తెలుపుతారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు, వారికి నచ్చిన దేశాల్లో నిపుణులైన కోచ్లతో శిక్షణ పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. దేశ యువ జనాభాకు తగిన స్థాయిలో క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించాలన్నదే ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు.
