రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎస్ డీఆర్ఎఫ్ నిధులు రూ. 900 కోట్లు ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ నిధులతో వరద బాధితులకు సహాయం చేయాలన్నారు. ఎస్ డీఆర్ఎఫ్ కింద మృతులకు రూ. 4లక్షలు ఇవ్వొచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి వరద బాధితులను, రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. 2020 నుంచి రైతులకు ఫసల్ బీమా అందడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు..కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వనివ్వదని మండిపడ్డారు.
హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరదల విషయం తెలియగానే కేంద్రమంత్రి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు కిషన్ రెడ్డి. ఆయన వెంటనే రెండు ఆర్మీ హెలికాప్టర్లను, 10 NDRF బృందాలను పంపించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాల్వలు కబ్జాలు కావడం, పూడిక తీత పనులు చేయకపోవడం వల్లే వరదలు ముంచెత్తాయని ఆరోపించారు. వరంగల్ నగరంలో ప్రతీయేటా వరదలు వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.