
- ఆరుగురిని అదుపులోకి తీసుకున్న కోదాడ పోలీసులు
కోదాడ, వెలుగు: కిడ్నీ వ్యాధితో బాధపడే వారిని గుర్తించి, మార్పిడి చేయిస్తామంటూ మోసం చేస్తున్న ఆరుగురు వ్యక్తులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళానికి చెందిన కడుపూరి తాతారావు, కొండం రమాదేవి, బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణువర్ధన్బాబు, మహ్మద్ సర్దార్తో పాటు మరో నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. వీరు విజయవాడ, గుంటూరులోని డయాలిసిస్ సెంటర్ల వద్ద తిరుగుతూ కిడ్నీ వ్యాధితో బాధపడే వారిని గుర్తించి, కిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ నమ్మించేవారు.
ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డిసెంబర్లో విజయవాడలోని డయాలిసిస్ సెంటర్కు వెళ్లిన, కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురానికి చెందిన సత్తూరి నరేశ్ను పరిచయం చేసుకున్నారు. తాము కిడ్నీ మార్పిడి చేయిస్తామని చెప్పడంతో నమ్మిన నరేశ్ వారికి రూ. 22 లక్షలు ఇచ్చాడు. తర్వాత ఓ కిడ్నీ దాతను పట్టుకొని అతడి రిపోర్ట్లు, నరేశ్ రిపోర్ట్లు సరిపోయేలా నకిలీవి తయారు చేసి కిడ్నీ మార్పిడి చేసేందుకు విజయవాడలోని ఓ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు.
తీరా ఆపరేషన్ జరిగే సమయంలో డబ్బులు కట్టకుండా పారిపోయారు. దీంతో నరేశ్ మరోసారి డబ్బులు కట్టి కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత డిసెంబర్లోనే కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న కోదాడ సీఐ శివశంకర్, ఎస్సై సుధీర్కుమార్ను డీఎస్పీ అభినందించారు.