మహానాడు వేదికపై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు : కొడాలి నాని

మహానాడు వేదికపై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.  మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.  సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. బీసీల కోసం 14 ఏళ్లు అధికారంలో ఉన్న  చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  ఎమ్మెల్యేగా గెలవని లోకేశ్ ఫోటో మహనాడులో ఎందుకు పెట్టారని... బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టినరోజంటూ చంద్రబాబును పొగుడుతారని.. చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారని అన్నారు.   ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా అని అన్నారు. 

చంద్రబాబు ఇప్పటికీ ఎన్నో  మేనిఫేస్టోలు రిలీజ్ చేసినా.. ఒక్క హామీని  నెరవేర్చేలేదని విమర్శించారు కొడాలి నాని.  వైస్రాయ్ హోటల్ లో క్యాంపు పెట్టి ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు  కారకులయ్యారని ఆరోపించారు.  చంద్రబాబు పెద్ద దొంగ అని.. 420 అని వ్యాఖ్యానించారు.  2019లో చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చి గాలికొదిలేశాడని మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసిన ఏ మేనిఫేస్టోపై అయినా చర్చకు సిద్ధమన్నారు. తాము 2019 మేనిఫేస్టోను తీసుకుని చర్చకు వస్తామని సవాల్ విసిరారు. 

2014లో  ప్రశ్నిస్తానంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఓటేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులకు,యువతకు, మహిళలకు చంద్రబాబు చేసిందేమి లేదన్నారు.  డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయలేదని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తాము పార్టీని మూసేస్తామంటూ ధ్వజమెత్తారు కొడాలి నాని.  చంద్రబాబు అధికారంలోకి వస్తే..పవన్ కళ్యాణ్ తో పాటు మీడియా సంస్థల్లో ఉన్న ఆ నలుగురే మళ్లీ బాగుపడతారు తప్ప ఎవరూ బాగుపడరని విమర్శించారు.