హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొంటున్న సభల్లో.. రెవెన్యూ అధికారులు అవినీతిపరులు అనేలా కామెంట్లు చేస్తున్నారని కిసాన్కాం గ్రెస్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాధికారులను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి గురువారం ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ విధంగా బాధ్యతారహితమైన కామెంట్లు చేయడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, గతంలో మహిళా తహసీల్దార్పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనే అందుకు ఉదాహరణ అని వెల్లడించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ సభల్లో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు.