పనికిరాని స్కీములతో లక్షల కోట్లు తగలేసిండు .. కేసీఆర్​పై కోదండరాం ఫైర్

పనికిరాని స్కీములతో లక్షల కోట్లు తగలేసిండు ..  కేసీఆర్​పై కోదండరాం ఫైర్

తొర్రూరు, వెలుగు : తెలంగాణ ఆత్మగౌరం, సీఎం కేసీఆర్​ అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఈసారి కేసీఆర్​ను ఓడించి ఫాంహౌజ్​కే పరిమితం చేయాలని టీజేఎస్​ చైర్మన్​ కోదండరాం ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్​  జిల్లా తొర్రూరు పట్టణంలో తెలంగాణ పీపుల్స్​జేఏసీ, తెలంగాణ సమాఖ్య­‌‌ -జాగో తెలంగాణ, భారత్​  బచావో సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఓటరు​ చైతన్య సదస్సులో కోదండరాం మాట్లాడారు. 

ఎందరో అమరల త్యాగాల ఫలితంగా  ఏర్పడిన తెలంగాణ నేడు కేసీఆర్​ కుటుంబ పాలనలో మగ్గిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిని అణచివేశారని ఫైర్  అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్​ కరెక్టుగా​ లేదన్నందుకే తనపై కక్షసాధింపు చేసి దూరం పెట్టారని తెలిపారు. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజలకు ఉపయోగపడని పథకాలు ప్రవేశపెట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్  దుబారా చేశారని మండిపడ్డారు. ‘‘రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని​ రూ.1.50 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని కేసీఆర్  అప్పుల ఊబిలోకి నెట్టాడు. 

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా పదేళ్లుగా నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నాడు. పేపర్​లీకేజీలపై ఒక్కమాట కూడా మాట్లాడని మంత్రి కేటీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వేస్తామనడం సిగ్గుచేటు. ఈసారి ఎన్నికల్లో  బీఆర్ఎస్​ను ఓడించి కేసీఆర్​కు తగిన బుద్ధి చెప్పాలి”  అని కోదండరాం పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్​రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, నిరూప్, గోపీనాథ్, సీనియర్  జర్నలిస్టు యాదగిరి, ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.