- ప్రొఫెసర్ కోదండరామ్
జహీరాబాద్, వెలుగు: ‘అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం కేసీఆర్ సొంత ఆస్తి కాదు’ అని టీజేఎస్ వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 317 జీఓకు వ్యతిరేకంగా టీజేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 317 జీఓ అప్రజాస్వామికమని, దీని ద్వారా ఎంప్లాయీస్,టీచర్లకు నష్టం జరుగుతుందన్నారు. కేసీఆర్ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి మనసుంటే వారికి న్యాయం చేయడం ఏమంత పెద్దపని కాదన్నారు. ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోవద్దని, టీచర్లు, ఉద్యోగులు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఉద్యమం చేస్తూనే కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశప్ప, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల లీడర్లు రామ్ చందర్ పాల్గొన్నారు.