కొడంగల్‌ ను దేశంలోనే తొలి మోడల్ సోలార్ మండలంగా మారుస్తం : స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్

కొడంగల్‌ ను దేశంలోనే తొలి మోడల్ సోలార్ మండలంగా మారుస్తం : స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్
  •     స్పెషల్ ​చీఫ్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్ వెల్లడి
  •     కొడంగల్​లో మోడల్ సోలార్ విలేజ్ అవగాహన సదస్సు

కొడంగల్, వెలుగు: దేశంలోనే మొట్టమొదటి మోడల్​సోలార్​ మండలంగా కొడంగల్​కు గుర్తింపు దక్కనుందని స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ అన్నారు. శనివారం కొడంగల్​ మున్సిపాలిటీలో నిర్వహించిన మోడల్​ సోలార్​ విలేజ్​ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న విద్యుత్​ అవసరాలకు తగినట్లు రాష్ర్ట ప్రభుత్వం సోలార్​ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. 

సీఎం రేవంత్​రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని 100 శాతం సోలార్​ గ్రామంగా మార్చామని చెప్పారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోని కొడంగల్​ మండలాన్ని 30 నుంచి 40 రోజుల్లో  మోడల్​ సోలార్​ మండలంగా మారుస్తామని పేర్కొన్నారు. కొడంగల్​ మండలంలోని 34 గ్రామాల్లో 5186 రూఫ్​ టాప్​, 2865 వ్యవసాయ పంప్​సెట్లకు సోలార్​ కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వ్యవసాయం, ఇంటి అవసరాలకు సోలార్​ విద్యుత్​ వినియోగంతో ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతు అదనంగా ఆదాయం పొందేందుకు వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ల సోలార్​ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. మిగులు విద్యుత్​ అమ్ముకోవడం ద్వారా రైతు ఏటా రూ.18 వేల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. అలాగే గృహలక్ష్మి లబ్ధిదారులకు 2 కిలోవాట్ల సోలార్​ ప్యానెల్​ను ఫ్రీగా ఏర్పాటు చేయడం ద్వారా 240 యూనిట్ల కరెంట్​ జనరేట్​ అవుతుందని తెలిపారు. మిగులు విద్యుత్​ విక్రయించడం ద్వారా యునిట్​కు రూ. 2.57 లబ్ధిదారుడికి చెల్లిస్తామని వెల్లడించారు. 

టీజీఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్  మాట్లాడుతూ కొడంగల్​ మండలంలోని 34 గ్రామాల్లో ఉచితంగా సోలార్​ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. టీజీ రెడ్​కో ఎండీ అనిల మాట్లాడుతూ సంప్రదాయ విద్యుత్​కు బదులుగా సోలార్​ పవర్  వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 81 గ్రామాలను ఎంపిక చేశామని, అందులో రూఫ్​టాప్​లు 40,349 అగ్రికల్చర్​ పంప్​సెట్లు 16,805 ఉన్నాయని తెలిపారు.