
ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో అత్యంత విలువైన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం ఆరు దేశాలకు ప్రాతినిధ్యం లభించగా..ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు చోటు దక్కింది. వీరితో పాటు హార్ధిక్ పాండ్యాను 12వ ఆటగాడిగా ఎంచుకుంది. ఇక ఇంగ్లండ్ నుంచి మొత్తం నలుగురికి అవకాశం లభించింది. ఈ జట్టుకు ఛాంపియన్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ను సారధిగా ఎంపిక చేసిన ఐసీసీ.. వికెట్కీపర్గానూ, ఓపెనర్గానూ అతన్నే ఎంచుకుంది.
ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లకు అవకాశం ఇచ్చింది. ఆతర్వాత ఆల్రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ ఇచ్చింది. బౌలర్లుగా సామ్ కర్రన్, అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా), మార్క్ వుడ్, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు అవకాశం కల్పించింది. నిన్న ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ జట్టు పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.