- బ్యానర్లు, ఫ్లెక్సీల మీద రూ.11.4 కోట్ల ఆమ్దానీ
- జీహెచ్ఎంసీకి రూ.6 వేల కోట్ల అప్పులున్నయ్
- ఎంఏయూడీ వార్షిక నివేదికలో వెల్లడించిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: కోకాపేట భూములు అర్రాస్ పెడ్తే హెచ్ఎండీఏకు రూ.2 వేల కోట్లు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ఎంఏయూడీ 2021–22 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 49 ఎకరాల భూమిని ఆన్లైన్ వేలానికి పెడితే రూ.2000.37 కోట్ల ధర పలికిందని పేర్కొంది. టీఎస్ బీపాస్ ద్వారా1.15 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేశామని, 2021–22లో 87,666 అప్లికేషన్ల ద్వారా138 మిలియన్ స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ స్కీం ద్వారా రూ.1,030 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పింది. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్ బ్యాంక్(టీడీఆర్)లో భాగంగా ఎస్ఆర్డీపీ, లింక్ రోడ్లు, మిస్సింగ్ లింక్స్ కోసం రూ.3,500 కోట్ల విలువైన1,049 టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 2.11 లక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలకు రూ.11.40 కోట్ల చలాన్లు విధించినట్లు వెల్లడించింది. లే ఔట్ల ఓపెన్ స్పేస్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఆక్రమణదారుల నుంచి 9.75 ఎకరాల భూమి రివకరీ చేసినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించని 3,880 హాస్పిటళ్లు, 660 ఫంక్షన్ హాళ్లకు,170 పబ్బులు, బార్లకు నోటీసులు ఇచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు తొలగించినట్లు తెలిపింది.
68 వేల డబుల్ఇండ్లు
కేపీహెచ్బీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగి, హైటెక్ సిటీ, కోకాపేట్ వరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఎంఏయూడీ వార్షిక నివేదికలో వెల్లడించింది. ముంబై నుంచి పూణే మీదుగా హైదరాబాద్కు హైస్పీడ్ రైల్ కనెక్టివిటీకి డీపీఆర్ రూపొందించినట్లు, హుస్సేన్సాగర్ చుట్టూ రోప్ వే నిర్మిస్తామని, వరంగల్కు మెట్రో నియో ప్రాజెక్టు ఇస్తామని పేర్కొంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 68,679 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్లు, వాటిలో 3,130 ఇండ్లు ప్రారంభించి అందులో 2,051 ఇండ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు చెప్పింది. హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. పట్టణ ప్రగతిలో భాగంగా 2020 ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలకు, జీహెచ్ఎంసీకి మొత్తం రూ.2,062.86 కోట్లు విడుదల చేయగా అందులో రూ.1,559.94 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
జీహెచ్ఎంసీ అప్పులు
జీహెచ్ఎంసీ రూ.5,983 కోట్ల అప్పులు తీసుకుందని, ఇందులో రూ.2 వేల కోట్లు ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే సమకూర్చుకుందని సర్కారు పేర్కొంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీయూఎఫ్ఐడీసీ రూ.4 వేల కోట్ల లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని, అందులోంచి మున్సి పాలిటీలకు రూ.3,809 కోట్లు అందజేసినట్లు పేర్కొంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ.90 కోట్ల టర్మ్ లోన్ తీసుకుందని వెల్లడించారు. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న10 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో లింక్ చేసే104 రోడ్ల విస్తరణకు రూ.2,410 కోట్లతో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించిందని పేర్కొంది. అమృత్ స్కీం కింద జీహెచ్ఎంసీ సహా 12 పురపాలిక ల్లో తాగునీటి వనరులు మెరుగు పరిచేందుకు రూ.1,666 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపింది. టీఎస్ రెరాలో 5,514 ప్రాజెక్టులు రిజిస్టర్ కాగా 4,505 ప్రాజెక్టులకు సర్టిఫికెట్లు జారీ చేశామని, 2,539 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 2,209 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.