నాకు దమ్ముంది జూపల్లి.. నీ ఇంటికే వస్త

నాకు దమ్ముంది జూపల్లి.. నీ ఇంటికే వస్త

నాగర్​కర్నూల్, వెలుగు: ‘నాకు దమ్ముంది.. నీ ఇంటికే వస్తా.. ఇంటి ముందే అన్నీ మాట్లాడుదాం’ అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రతి సవాల్​ విసిరారు. ఈనెల 26వ తేదీన స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు జూపల్లి సవాల్​చేయడంతో ఎమ్మెల్యే బీరం స్పందించారు. చౌరస్తాలోకి కాదు నీ ఇంటికే వస్తానని స్పష్టం చేశారు. సోమవారం కొల్లాపూర్​లో ఎమ్మెల్యే బీరం ప్రెస్​మీట్​పెట్టి మాట్లాడారు. దేనిపైన చర్చకు రమ్మన్నా తాను సిద్ధమని చెప్పారు. అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహం ముందు నీలాంటి వ్యక్తుల చరిత్ర గురించి మాట్లాడితే ఆ స్థలం అపవిత్రం అవుతుందన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, చేసినా కొల్లాపూర్​ను అభివృద్ధి చేసేది టీఆర్ఎస్ పార్టీనే అన్నారు. 1983లో బ్యాంకులో క్యాషియర్​గా పనిచేసిన నాటి నుంచి హుస్సేన్ సాగర్​లో కారు ప్రమాదం, ప్రుడెన్షియల్ బ్యాంక్ బాధితుల క్షోభ వరకు అన్నీ చర్చిద్దామన్నారు. తన హయాంలో ఎంత మంది రాజకీయ నాయకులు హత్యలకు గురయ్యారో కూడా మాట్లాడదామన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మావోయిస్టులు ఇద్దరి గన్​మన్ లను కాల్చి చంపినా అక్కడే ఉన్న జూపల్లిని ఎందుకు ఏం అనలేదో చర్చిద్దామన్నారు. కుడికిళ్ల గ్రామంలో ఎదురు కాల్పులు జరిగినప్పుడు నీ అనుచరులకు డబ్బులు దొరికాయి కదా వాటిని ఎవరు పంపించారో మాట్లాడదాం అన్నారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వారితో అబద్ధాలు ప్రచారం చేయిస్తే అన్నీ నిజాలు అయిపోవని మండిపడ్డారు. కొల్లాపూర్​అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసలు జూపల్లి ఎవరి పక్షమో తేల్చుకోవాలని సవాల్ చేశారు.