కోల్‌క‌తా: రెచ్చిపోయిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. ప్ర‌త్య‌ర్థి జట్టు అభిమానులపై దాడి

 కోల్‌క‌తా: రెచ్చిపోయిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. ప్ర‌త్య‌ర్థి జట్టు అభిమానులపై దాడి

ప్రతిష్టాత్మక డ్యురాండ్ క‌ప్‌లో జాతి వివక్ష ఘటన చోటుచేసుకుంది. కోల్‌క‌తాకు చెందిన‌ ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్ల‌బ్ ఫ్యాన్స్.. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్ల‌బ్ అభిమానుల‌పై దాడికి  పాల్పడ్డారు. అంతేకాదు వారిని ఉద్దేశిస్తూ జాతి వివ‌క్ష‌ పూరిత వ్యాఖ్య‌లు చేశారు. మంగళవారం స్థానిక సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సి మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఆఖరివరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమయం ముగిసేసరికి ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమం చేయడంతో.. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇందులో ఈస్ట్ బెంగాల్ జ‌ట్టు విజ‌యం సాధించడంతో.. ఆ జట్టు మద్దతుదారులు సంబురాల్లో మునిగి పోయారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు.. నార్త్ ఈస్ట్ జట్టు అభిమానుల‌పై జాతి వివ‌క్ష‌పూరిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఇటుకలు విసిరారు. 

ఇరు జట్ల అభిమానులకు ప్రత్యేక స్టాండ్‌లు కేటాయించినప్పటికీ.. వాటిపైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు. దీంతో అక్క‌డ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప‌రిస్థితిని గ‌మనించిన పోలీసులు గంట తరువాత.. నార్త్ ఈస్ట్ క్ల‌బ్ అభిమానుల‌ను అక్క‌డి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఈ ఆందోళ‌న‌కు కారణ‌మైన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు  తెలుస్తోంది.

కాగా, బుధవారం(ఆగష్టు 30) జరిగే రెండో సెమీఫైన‌ల్లో ఎఫ్‌సీ గోవా, మొహున్ బ‌గ‌న్ సూప‌ర్ జెయింట్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.