మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. 

మునుగోడు ఎన్నిక రాష్ట్ర, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో  ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్న ఆయన.. కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి  ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.