- రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- సీఎం పదవి పైన వ్యామోహం లేదు
- త్వరలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తం
- పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరుతారని ఆశిస్తున్న
నల్గొండ, వెలుగు: కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే.. సీఎం కుర్చీ కోసం ఆ పార్టీలో చాలా మంది కొట్టుకుంటరని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ట్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, సంతోష్, కవిత, హిమాన్షుతో సహా ఎల్లారావు, పుల్లారావు, రవీందర్రావు లాంటి వాళ్లు సీఎం సీటు కోసం కొట్టుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కర్నాటక ఫలితాలే ఇక్కడ కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకే తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులులేవని, అందరం కలిసికట్టుగానే ఉన్నామని ఆయన తెలిపారు.
20 నియోకజకవర్గాల చొప్పున త్వరలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీనియర్లు పర్యటిస్తారని, కాంగ్రెస్ గెలుపునకు పాటు పడతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం ఆ పార్టీలో పది మంది పోటీ పడడం ఖాయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఆయన విరుచుకుపడ్డారు. మూడు పార్టీలు మారి, క్యారక్టర్ లేని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆయన ఆస్తులు రూ.5వేల కోట్లు అని, బీవెల్లంలో తనకున్న ఐదు ఎకరాలు రాసిస్తానని.. నల్గొండలో గుత్తా ఉంటున్న ఇల్లు నాకు ఇవ్వాలని చాలెంజ్ చేశారు. నల్గొండలో ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నానని, గుత్తా ఇల్లు ఇస్తే కనీసం అద్దె అయిన తప్పుతుందని అన్నారు. నా భార్య, బిడ్డ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. నల్గొండ, నకిరేకల్నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీధికొకరు చొప్పున కొట్టుకుంటున్నారని విమర్శించారు.
పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపా..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపానని, జూన్ 2 లేదా ఆ తర్వాత గానీ వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్తో తాను మాట్లాడలేదని అన్నారు.