
- నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి
- సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాం
- ఐదు కోట్లతో కొర్లపాడ్ టోల్గేట్ వద్ద ట్రామా కేర్ సెంటర్
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ (కేతేపల్లి), వెలుగు: హైదరాబాద్–-విజయవాడ జాతీయ రహదారిని నేషనల్ ఎక్స్ ప్రెస్హైవేగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం కేతేపల్లి మండలం కొర్లపాడ్టోల్గేట్ వద్ద రూ.5 కోట్లతో ట్రామా కేర్సెంటర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జీఎమ్మార్ టోల్ వసూలు ఆపేశామని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి జాతీయ రహదారిని ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేందుకు ఆమోదం తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తామన్నారు.
అయితే, జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే సీఎస్సార్ ఫండ్స్ కింద కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి ఏడీపీ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న సెంటర్ ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.50 వేల కోట్లతో మాసీ ప్రక్షాళన చేపడ్తామని, ఆగస్టు 15 నుంచి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని మంత్రి వివరించారు. రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ హరిచందన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు రక్షించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని ద్వారా 60 శాతం నుంచి 70 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.