
- తనకు 500 ఎకరాల భూమి ఉంది.. అందులో 16 ఎకరాలు అమ్మిన
- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
వరంగల్, వెలుగు : ‘ఇటీవలి ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు పెట్టా.. ఇందుకోసం 16 ఎకరాల భూములు అమ్మాను’ అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ చెప్పారు. ఆదివారం వరంగల్లో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాను ఎన్నికల సమయంలో ఎవరి వద్ద డబ్బులు తీసుకోనని, తనకు ఇంకా 500 ఎకరాల భూమి ఉందని చెప్పారు. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే చాలా ఇబ్బందులు పడ్డాననన్నారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా సురేఖను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించానన్నారు.
దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డి తనను ఎమ్మెల్సీగా నిలబెడితే.. ఎర్రబెల్లి దయాకర్రావు సోదరులు ఓ డాక్టర్ను తనకు పోటీగా నిలబెట్టి రౌడీకి, డాక్టర్కు మధ్య పోటీ అని ప్రచారం చేశారన్నారు. ఓటర్లను వారు సిమ్లా తీసుకెళ్తే.. తాను గోవా తీసుకెళ్లానని.. తీరా ఎన్నికల టైంలో 245 మంది వారే తనకు ఓటు వేశారన్నారు. మరోసారి తాను నామినేషన్ వేస్తే ఏ ఒక్క పార్టీ కూడా నామినేషన్ వేయలేదన్నారు. చట్టసభల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని తానేనన్నారు.
కాపుల కోసం తాను హనుమకొండ అలంకార్ జంక్షన్లో రూ.20 కోట్లు ఖర్చు చేసి ఎకరంన్నర భూమి తీసుకున్నానని.. ఇప్పుడది రూ.50 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే భవన నిర్మాణ కోసం రూ.5 కోట్ల ఫండ్స్ తీసుకొస్తే దానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. కొండా మురళీకి ఒక్కపైసా అవసరం లేదని.. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొండా సురేఖకు అండగా నిలవాలని సూచించారు..