బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని..రాబోయే ఎన్నికల్లో బీజేపీ..బీఆర్ఎస్ ను ఓడిస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీలో తానే కాదు..మరెవరూ కూడా పార్టీని వీడటం లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డికి ఆహ్వానం..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని..కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్ లోని మిగతా నేతలు కూడా బీజేపీలో చేరాలన్నారు. బీజేపీ అంటే సెక్యులర్ పార్టీ అని ..అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ని కూడా బీజేపీలో చేరాలని కోరామన్నారు.
కాంగ్రెస్ కన్ఫ్యూజ్ట్ పార్టీ..
కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గతంలో బలవంతంగా ఏపీ, తెలంగాణలను కలిపిందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలను బలవంతంగా కలిపిన కాంగ్రెస్ ...ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం మళ్లీ విడదీసిందని విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తుందని విమర్శించారు. వారికి ఒక పాలసీ, సిద్దాంతం అంటూ ఏది లేదని మండిపడ్డారు. బీజేపీపై మతతత్వ పార్టీ ముద్ర వేస్తున్నారని విమర్శించారు. తమ గుజరాతీ పార్టీ అని అంటున్నారని...ఆర్ఎస్ఎస్ పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది తమ చేతిలో లేదన్నారు. రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదని గుర్తు చేశారు.
తెలంగాణ వ్యతిరేకులే..
ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నొళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను దొంగలన్న కేసీఆర్.....ఇప్పుడు అవసరం కోసం వారిని పొగుడుతున్నారని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఆంధ్రా వారిని విమర్శించలేదన్నారు. బీజేపీకి కర్ణాటకలో గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయో.. ఇప్పుడు కూడా అన్నే ఓట్లు వచ్చాయన్నారు.