
న్యూఢిల్లీ, వెలుగు: పొత్తులో భాగంగా శేరి లింగంపల్లి సీటును జనసేనకు కేటాయించొద్దని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. శుక్ర వారం ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, సంతోష్ తో వేరు వేరుగా భేటీ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ సీటును బీజేపీ గెలవాలంటే శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమని నేతలకు వివరించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. తన విజ్ఞప్తిపై హైకమాండ్ సానుకూలంగా స్పందించిందని కొండా విశ్వేశ్వర రెడ్డి ‘వీ6 వెలుగు’కు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.