
- మొత్తం ఆదాయం రూ.14,096 కోట్లు
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం డిసెంబర్ క్వార్టర్లో 6.75 శాతం వృద్ధితో రూ. 4,264.78 కోట్లకు చేరుకుంది. బ్యాంకు గత ఏడాది కాలంలో రూ. 3,995.05 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. స్టాండెలోన్ ప్రాతిపదికన, ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుకు పన్ను తర్వాత లాభం రూ. 2,791.88 కోట్ల నుంచి రూ. 3,005.01 కోట్లకు పెరిగింది. అయితే ఇది సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన లాభం రూ. 3,190.97 కోట్ల కంటే తక్కువగా ఉంది.
మొత్తం ఆదాయం రూ.10,947 కోట్ల నుంచి రూ.14,096 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఖర్చులు రూ.3,751 కోట్ల నుంచి రూ.4,284 కోట్లకు పెరిగాయి. రిపోర్టింగ్ క్వార్టర్లో మొత్తం కేటాయింపులు రూ. 148.83 కోట్ల నుంచి రూ. 579.14 కోట్లకు పెరిగాయి. ఇది లాభంపై ప్రభావం చూపింది. గ్రాస్ఎన్పీఏలు 1.72 శాతం నుంచి 1.73 శాతానికి పెరిగాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో తన పెట్టుబడుల కోసం రిపోర్టింగ్ క్వార్టర్లో రూ.190.13 కోట్లు కేటాయించామని బ్యాంక్ తెలిపింది.