న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 2025తో ముగిసిన మూడో క్వార్టర్ (క్యూ3)లో రూ.3,446 కోట్ల నికర లాభం (స్టాండ్ఎలోన్) సాధించింది. 2024లోని ఇదే కాలంలో వచ్చిన రూ.3,305 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. అయితే విశ్లేషకులు ఊహించిన రూ.3,572 కోట్ల లాభాన్ని బ్యాంక్ సాధించలేకపోయింది.
బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.16,741 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.7,565 కోట్లు కాగా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.93 శాతం నుంచి 4.54 శాతానికి తగ్గింది. కోటక్ బ్యాంక్ ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏల) రేషియో 1.30 శాతానికి, నెట్ ఎన్పీఏల రేషియో 0.31 శాతానికి మెరుగుపడ్డాయి.
అయితే ప్రొవిజన్లు ఏడాది లెక్కన రూ.794 కోట్ల నుంచి రూ.810 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ లాభం క్యూ3లో ఏడాది లెక్కన 5 శాతం పెరిగి రూ.4,924 కోట్లకు చేరింది. కొత్త లేబర్ కోడ్స్ కారణంగా రూ.98 కోట్ల అదనపు ఖర్చు జరిగిందని కోటక్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.
