
సిరిసిల్ల టౌన్, వెలుగు : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. సిరిసిల్లలో సోమవారం జరిగిన సీపీఐ జిల్లా స్థాయి నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశత్వం, వెట్టిచాకిరి, భూస్వామ్య పోరాటానికి వ్యతిరేకంగా రైతాంగ సాయిధ పోరాటాన్ని నిర్వహించింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో సంపద కొందరి చేతుల్లోనే ఉందని, ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు పీఎం కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
కమ్యూనిస్ట్ పార్టీని అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో మతాలు, కులాల పేరిట చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, నాయకులు కడారి రాములు, అజ్జ వేణు, మీసం లక్ష్మణ్, మంద అనిల్, మార్వాడి సుదర్శన్, ఎలిగేటి రాజశేఖర్, మర్రి వెంకటస్వామి, కేవీ.అనసూయ, మంద పవన్, సోమ నాగరాజు పాల్గొన్నారు.