
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో భేటీ అయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వుల కాపీని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ కు అందజేశారు. వర్సిటీ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించాలని మంత్రి సబిత ఆదేశించారు. బోధన సౌకర్యాలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.