
ఇదేక్కడి ఘోరం..ఇదెక్కడి అన్యాయం..డెలివరీ కొద్దిగా లేట్ అయిందని డెలివరీ బాయ్ ని చితక్కొ్ట్టారు. ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డెలివరీ బాయ్ కాలు విరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆగస్టు 5వ తేదీ కుత్బుల్లాపూర్లో నివాసం ఉండే కేపీ విశాల్ గౌడ్ కు అమెజాన్ నుంచి ఓ పార్సిల్ వచ్చింది. డెలివరీ బాయ్ షేక్ రహాన్ ఫయాజ్ దాన్ని విశాల్ గౌడ్ కు అందించేందుకు కుత్బుల్లాపూర్ కు వెళ్లాడు. అయితే విశాల్ గౌడ్ అడ్రెస్ సరిగా తెలియకపోవడంతో కొంత ఆలస్యం అయింది. చివరికు ఎలాగోలా అడ్రెస్ కనుక్కున్న డెలివరీ బాయ్ విశాల్ గౌడ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి పార్సిల్ అందజేశాడు. అయితే ఆలస్యం కావడంతో డెలివరీ బాయ్ ను విశాల్ గౌడ్ తో పాటు..మరో ఏడుగురు స్నేహితులు ఇంట్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో షేక్ రహాన్ ఫయాజ్ కాలు విరిగిపోయింది. అతనికి తీవ్రంగా గాయపడ్డాడు. దెబ్బలతో ఇంటికి వెళ్లిపోయిన అతను..చికిత్స తీసుకునేందుకు ఊరికి వెళ్లిపోయాడు. అయితే కోలుకున్న తర్వాత ఆగస్టు 10వ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు..కేపీ విశాల్ గౌడ్, అతను స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.