- ఔట్లెట్లు అప్పగించాలని రెండు రాష్ట్రాలకు బోర్డుల ప్రపోజల్
- పవర్ హౌస్లు ఇచ్చేందుకు తెలంగాణ నో
- ప్రతిపాదనలు స్టడీ చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు
- గెజిట్కు సానుకూలంగా ఉన్నా జీవో ఇవ్వని ఏపీ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల జ్యూరిస్డిక్షన్ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా నెలకొంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ గురువారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా తెలంగాణ పరిధిలోని ఔట్లెట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గెజిట్ అమలుకు పూర్తిగా సహకరిస్తామని ఏపీ ఇప్పటికే చెప్పింది. కానీ పవర్ ప్లాంట్లు అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. రెండు రాష్ట్రాలు ఉత్తర్వులిస్తేనే ఆయా ఔట్లెట్ల నిర్వహణను తాము తీసుకుంటామని బోర్డులు చెబుతున్నాయి. దీంతో గెజిట్ అమలుపై సందిగ్ధత నెలకొంది.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జులై 15న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ గురువారం (అక్టోబర్ 14) నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ గెజిట్లోని రెండో షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల ఔట్లెట్లను ఆయా బోర్డులకు అప్పగించాలని గెజిట్లో స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధిలోకి 12 ప్రాజెక్టుల్లోని 63 కాంపోనెంట్స్, గోదావరి బోర్డు పరిధిలోకి 16 ప్రాజెక్టుల్లోని 33 కాంపోనెంట్స్ వెళ్లాల్సి ఉంది. గెజిట్ అమలుపై ఆయా బోర్డులు సబ్ కమిటీలు ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాయి. పలు సమావేశాలు, ఫుల్ బోర్డు మీటింగుల తర్వాత మొదట గోదావరిపై పెద్దవాగులోని మూడు ఔట్లెట్లు.. కృష్ణాలో శ్రీశైలం, నాగార్జునసాగర్లపై గల 15 ఔట్లెట్లను బోర్డులకు అప్పగించాలని నిర్ణయించారు.
రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపిన బోర్డులు
కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా ప్రాజెక్టుల ఔట్లెట్లను తమకు అప్పగించాలంటూ బుధవారం సాయంత్రం రెండు రాష్ట్రాలకు బోర్డులు ప్రతిపాదనలు పంపాయి. మీటింగ్ మినిట్స్ వివరాలతో పాటు అప్పగించాల్సిన ఔట్లెట్ల జాబితాను పంపాయి. గోదావరిపై పెద్దవాగు ప్రాజెక్టులో ఉన్న రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, స్పిల్ వే తమ నిర్వహణకు అప్పగించాలని జీఆర్ఎంబీ కోరింది. కృష్ణాపై శ్రీశైలంలో స్పిల్వే, కుడి, ఎడమ పవర్ హౌస్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, కల్వకుర్తి పంపుహౌస్లు, నాగార్జునసాగర్లో స్పిల్ వే, మెయిన్ పవర్ హౌస్, కుడి, ఎడమ కాల్వల హెడ్ రెగ్యులేటర్లు, పవర్ స్టేషన్లు, ఏఎమ్మార్పీ లిఫ్ట్ స్కీం, వరద కాలువ హెడ్ రెగ్యులేటర్లు అప్పగించాలని కేఆర్ఎంబీ కోరింది.
స్టడీకి కమిటీ వేసిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఔట్లెట్లపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. పవర్ ప్లాంట్లను అప్పగించేది లేదని అధికారులు చెప్తున్నారు. సీఎం నిర్ణయం మేరకే ఉత్తర్వులు జారీ చేస్తామని అంటున్నారు. గెజిట్ పరిధిలోకి చేరే ఔట్లెట్ల ప్రతిపాదనపై స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ నియమించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లను సభ్యులుగా చేర్చారు. వీరు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిశీలించి వాటిని బోర్డులకు అప్పగించాలా లేదా ప్రభుత్వానికి రెండు వారాల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
పాక్షికంగా అమలు చేయవచ్చా?
గెజిట్ అమలుకు ఏపీ జీవోలిస్తే ఆ రాష్ట్రంలోని కృష్ణా ఔట్లెట్ల నుంచి గెజిట్ అమలు సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. తెలంగాణ నిర్ణయం వెల్లడించకుండా ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసింది. ఈ నివేదిక వచ్చే వరకు వేచి చూడకతప్పని పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాలు ఓ ప్రాజెక్టు పరిధిలోని ఔట్లెట్లను అప్పగించిన తర్వాతే బోర్డులు వాటిని తమ అధీనంలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పాక్షికంగానూ గెజిట్ అమలు సాధ్యం కాదని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఆయా ఔట్లెట్లను అప్పగించేలా రెండు రాష్ట్రాలతో తదుపరి కమ్యూనికేషన్ కొనసాగిస్తామని అన్నారు.