
తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు కృష్ణా-గోదావరి నదుల లీంక్కు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని… ఇంజినీర్ పాత్రలో సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వెల్లడించారు. కోదాడ మెయిన్ రోడ్డులో 19కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విద్యుత్ సంక్షోభానికి ముగింపు పలికిన సీఎం రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
కోటి యాభై లక్షల ఏకరాలకు నీళ్లు అందించేందుకు ఇంజినీర్ అవతారమెత్తిన కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం చారిత్రాక ఘట్టం అన్నారు. పాలమూరు-–రంగారెడ్డి లిఫ్ట్ పథకం పూర్తి చేయడంతో పాటు గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు అందించాలన్నదే సీఎం తపన అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ర్టంలో వివిధ సంక్షేమ పధకాల అమలు కోసం 50వేల కోట్ల రూపాయలు కేటాయించి, సంక్షేమ పధకాల అమలులో దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆధర్శంగా నిలిచిందన్నారు. రానున్న మున్సిపల్ఎన్నికలలో కోదాడ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు టిఆర్ఎస్గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.