హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్, రైట్ బ్యాంక్ పవర్ హౌస్ల్లో కరెంట్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కృష్ణా బోర్డు కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎల్బీ మౌన్తంగ్ గురువారం తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్, ఏపీ వాటర్ రీసోర్సెస్ సెక్రటరీ శ్యామలరావుకు లెటర్ రాశారు. అక్టోబర్ నుంచి రెండు రాష్ట్రాలు నిరంతరాయంగా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉన్నా శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తి ద్వారా నదిలోకి నీటిని విడుదల చేయడం సరికాదన్నారు. శ్రీశైలంలో ఈ నెల 18 నాటికి నీటి నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొన్నారు. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ద్వారా 312.86 మిలియన్ యూనిట్లు, రైట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి 295.91 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేశారని వివరించారు. కరెంట్ ఉత్పత్తి ద్వారా 55.96 టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చిందన్నారు. ఈ వాటర్ ఇయర్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి బోర్డుకు ఎలాంటి ఇండెంట్ పంపలేదని పేర్కొన్నారు. నాగార్జునసాగర్కు దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేనప్పుడు శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదలడం సరికాదన్నారు. కేఆర్ఎంబీ 12వ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. తాగు, సాగునీటి అవసరాలు లేనప్పుడు కరెంట్ ఉత్పత్తి చేస్తూ విలువైన నీటిని వృథాగా సముద్రంలోకి వదలడం సరికాదన్నారు. వెంటనే రెండు రాష్ట్రాలు స్పందించి కరెంట్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల ఆపేయాలని కేఆర్ఎంబీ మెంబర్ కోరారు.