కే విశ్వనాథ్ మృతి పట్ల కృష్ణం రాజు భార్య భావోద్వేగం

కే విశ్వనాథ్ మృతి పట్ల కృష్ణం రాజు భార్య భావోద్వేగం

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె.విశ్వనాథ్​ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ మరణంతో ఒక శకం ముగిసిందని ఆవేదన చెందారు. 

"టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది.కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు. కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన శివైక్యం చెందారని తెలిసి మేమంతా చాలా బాధపడుతున్నాం. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భారతం వంటి చిత్రాల్లో కృష్ణం రాజు నటించారు. హీరో కావాలని చెన్నైకి వెళ్లిన కృష్ణంరాజు ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణంరాజు నటనా ప్రావీణ్యాన్ని పరిశీలించాలని తన అసిస్టెంట్ అయిన కె.విశ్వనాథ్ కి సుబ్బారావు చెప్పారట. అప్పుడు ప్యాథటిక్ డైలాగ్స్ ఇచ్చి వాటిని చెప్పాలని కృష్ణంరాజును కె.విశ్వనాథ్ అడగగా ఆ డైలాగ్స్ చెప్తున్న క్రమంలోనే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని, అది గమనించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కృష్ణంరాజుని హీరోగా ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్నో సార్లు కృష్ణంరాజు చెబుతూ ఉండేవారు. ఒకరకంగా కృష్ణంరాజు విశ్వనాథ్ ని తన గురు సమానంగా భావించేవారు. విశ్వనాథ్ మరణంతో ఒక శకం ముగిసినట్లయింది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధ నుంచి కోలుకునే విధంగా భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని శ్యామలాదేవి తెలిపారు.