నేడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు

నేడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు

సినీ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్నాయి. మొయినాబాద్ లోని కనక మామిడి కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఉదయం పదకొండున్నరకు అంతిమయాత్ర మొదలుకానుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు  చేసింది . కృష్ణంరాజు అంత్యక్రియలను  మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తొలుత వార్తలొచ్చాయి. అభిమానుల సందర్శనార్థం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్క రెడ్డి స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరగా ఆయన ఫామ్ హౌస్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి రారాజుగా పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు .. ఒక కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. అయితే ఆమె రావాల్సి ఉండటంతో.. నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా కృష్ణంరాజు మరణం పట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభాస్‌ను ఫోన్లో పరామర్శించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని కృష్ణంరాజుకు నివాళులర్పిస్తున్నారు.