- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : ‘కాళేశ్వరం ప్రాజక్ట్ వల్ల సిద్దిపేట జిల్లా రూపురేఖలే మారిపోయాయి, ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో పాటు మత్తళ్లు దుంకుతున్న చెరువులకు ఆ ప్రాజక్ట్ నీళ్లే కారణం’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. బుధవారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో వేసవిలోనూ 85 వేల ఎకరాల్లో వరి సాగవుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఇది సాధ్యం అయ్యేదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్కి వలసపోతే ఇప్పుడు.. నాట్లు వేసేందుకు బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వస్తున్నారన్నారు.
సిద్దిపేటను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపామన్నారు. ఈ సందర్భంగా 300 మందికి 62.88 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ చేశారు. అలాగే సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం, నంగునూరు మండలం రాంపూర్ సీతారామ చంద్రస్వామి ఆలయం, గట్ల మల్యాలలోని పెద్దమ్మ దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.
