50 శాతం ఇవ్వాల్సిందే!..కృష్ణా జలాలపై తెలంగాణ పట్టు

50 శాతం ఇవ్వాల్సిందే!..కృష్ణా జలాలపై తెలంగాణ పట్టు

 

  • వాస్తవానికి రాష్ట్రం వాటా 70 శాతం
  • ఎల్​నినో కారణంతో తక్కువడిగాం
  • కేఆర్ఎంబీ సమావేశంలో మన వాదనిదే
  • నేడు కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వినియోగంపై మరోసారి కృష్ణా బోర్డు త్రీమెంబర్​ కమిటీ సమావేశం కానుంది. గత నెల 24న జరిగిన మీటింగ్​లో నీటి పంపకాల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ నెల 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​లో నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో గత సమావేశం ఏమీ తేలకుండానే ముగిసింది. తాజా సమావేశంలో ఏపీ.. వెలిగొండ టన్నెల్​ నుంచీ నీళ్లు తీసుకెళ్తుండడంపై త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​లో ఫిర్యాదు చేసేందుకు మన అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పోతిరెడ్డిపాడుపై గత మీటింగ్​లో బోర్డుకు ఫిర్యాదు చేసిన అధికారులు.. ఇప్పుడు వెలిగొండ నుంచి కూడా దాని కెపాసిటీకి మించి నీటిని తోడేస్తుండడంపై ఫిర్యాదు చేయనున్నారు. వెలిగొండ టన్నెల్​ కెపాసిటీ 3 వేల క్యూసెక్కులే కాగా.. ప్రస్తుతం 3,500 క్యూసెక్కులను ఏపీ తరలిస్తున్నది. టన్నెల్​ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు ఒక టీఎంసీ నీటిని వెలిగొండ టన్నెల్​ ద్వారా ఏపీ తరలించుకున్నది. మరోవైపు పోతిరెడ్డిపాడు నుంచి 8 వేల క్యూసెక్కులను తీసుకుపోతున్నది. మల్యాల నుంచి 2,700 క్యూసెక్కులు తీస్కుపోతున్నది. అదే సమయంలో సాగర్​ నుంచి కుడి కాల్వ ద్వారా 6,500 క్యూసెక్కులను తరలిస్తున్నది. పది రోజుల క్రితం ఏపీ బలవంతంగా సాగర్​ కుడి కాల్వ నుంచి నీటిని తరలించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపైనా త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​లో అధికారులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక, ఏపీ అధికారులు తమకు కావాల్సిన అంశాలతో ఇండెంట్​ తయారు చేసి నేరుగా సమావేశంలోనే బోర్డు ముందు పెట్టనున్నట్టు తెలిసింది. 

గత మీటింగ్​లో కుదరని సయోధ్య 

గత నెల 24న నిర్వహించిన మీటింగ్​లో నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ పట్టుబట్టాయి. తెలంగాణ అధికారులు పోతిరెడ్డిపాడుపై నియంత్రణ పెట్టాలని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. 70 శాతం నీళ్లు తమకే రావాల్సి ఉన్నా.. ప్రస్తుత ఎల్​నినో పరిస్థితుల నేపథ్యంలో 50 శాతానికి పరిమితమవుతున్నామని పేర్కొంది. మొత్తంగా తాగునీటి అవసరాలకే 112 టీఎంసీలు కావాలని తేల్చి చెప్పింది. అయితే, ఏపీ మాత్రం అక్టోబర్​ వరకే 47 టీఎంసీలు కావాలని పట్టుబట్టింది. బోర్డు కూడా తాగునీటికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.

అయితే, ఈ అంశాలపై ఎటూ తేలకుండానే ఆ సమావేశం ముగిసింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. నెల రోజులుగా ప్రాజెక్టుకు సరైన ఇన్​ఫ్లోస్​ కూడా లేవు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులకు వరదలు రావడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 145 టీఎంసీలకు పడిపోయింది. రెండు వారాల క్రితం ప్రాజెక్టులో 180 టీఎంసీలదాకా నీళ్లుండగా.. ఈ గ్యాప్​లోనే 35 టీఎంసీలు ఖాళీ అవ్వడం గమనార్హం. నాగార్జునసాగర్​లో 179.50 టీఎంసీల వాటర్​ ఉన్నాయి. ఎల్​నినో ప్రభావం ముదురుతుండడంతో వచ్చే ఎండా కాలం వరకు నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.