
- సంఘం ఇన్చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్
- ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు
- పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత
హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఇన్చార్జ్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ నియమించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ సంఘం బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేయాలని కేటీఆర్ఆదేశించారు. సంఘం ఏ కార్యక్రమం చేసినా పార్టీకి అనుబంధంగానే చేయాలని స్పష్టంచేసినట్లు సమాచారం.
అయితే, టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పించినట్లు తెలుస్తున్నది. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించినట్లు టీబీజీకేఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ‘సేవ్ సింగరేణి’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
మరోవైపు సంఘం ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించే అంశంపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెప్తున్నారు. సంఘం ఎన్నికలు జరిగి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. కొత్త కార్యవర్గం ఎన్నికలపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
టీబీజీకేఎస్తో కవితకు పదేండ్ల అనుబంధం
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 నుంచి టీబీజీకేఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా కవిత వ్యవహరిస్తున్నారు. ఈ పదేండ్ల కాలంలో పార్టీకి, యూనియన్కు మధ్య కవిత అనుసంధాకర్తగా ఉంటూ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత టీబీజీకేఎస్ కీలక నేతలు రాజీనామా చేయడంతో 2023, డిసెంబర్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదు. దీంతో కవిత యూనియన్ కార్యకలాపాలకు కాస్త దూరమయ్యారు.
ఈలోగా బీఆర్ఎస్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత తన సొంత సైన్యాన్ని పెంచుకోవడంలో భాగంగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా ‘సింగరేణి జాగృతి’ పేరుతో కమిటీలను వేసి సింగరేణిలో కార్యకలాపాలకు పిలుపునిచ్చారు.